దేశ చేనేత రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న “భారత్ టెక్స్ 2026” ప్రదర్శనలో భాగంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు లభించాయని ఆమె వెల్లడించారు. టెక్స్టైల్ రంగంలో సుమారు రూ. 4,100 కోట్ల విలువైన మూడు కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు మంత్రి వివరించారు.
ఈ ఒప్పందాల్లో భాగంగా, తిరుపూర్కు చెందిన బీకేఎస్ ఫ్యాబ్రిక్స్ సంస్థ రాష్ట్రంలో రూ. 4,000 కోట్ల పెట్టుబడితో ఒక ఆధునిక టెక్స్టైల్ రీసైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంట్లో, వినియోగించిన వస్త్ర వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, వాటిని పునర్వినియోగానికి అనుగుణంగా ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
మరో ఒప్పందం ప్రకారం, విశాఖపట్నంలో రూ. 100 కోట్ల పెట్టుబడితో ఒక గార్మెంట్ తయారీ యూనిట్ను నెలకొల్పనున్నారు. దీని ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే, రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు నాశిక్కు చెందిన క్యాప్స్ ఫౌండేషన్తో మూడో ఒప్పందం కుదిరినట్లు మంత్రి తెలిపారు.
